భారతీయులకు చారిత్రక స్పృహ లేదా? భారతదేశానికి ఒక గతం ఉంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. అద్భుతమూ అతి ప్రాచీనమూ అయిన సాహిత్య సంప్రదాయం ఉంది. నేటికీ మన మనుగడలో భాగమైన ఇతిహాసాలు, పురాణాలు, వీరగాథలు మన పూర్వీకులు మనకిచ్చిన జాతి వారసత్వ సంపద. అవి నిజాలా, కల్పితాలా? మన ప్రాచీన వాఙ్మయంలో చారిత్రక సత్యం ఎంత? ఆర్యులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మోహెంజోదారో నగరం జీవించి ఉన్న కాలంలో దాని అసలు పేరు ఏమిటి? దేవాసురులు - నాటి అద్భుత కల్పనలోని పాత్రలేనా? వసిష్ఠ విశ్వామిత్రుల వంటి వైదిక ఋషులు - వ్యక్తులా, వంశాలా, వ్యవస్థలా? అయోధ్య కాశీ హస్తిన లంక - వాటి నిజమైన ఉనికి ఏదో మనకు తెలుసా? హరప్పా నాగరికత పతనానంతరం అక్కడి ప్రజలకు ఏమైంది? మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది? పురాణ సంప్రదాయంలోని చారిత్రక వాస్తవికతని, పురావస్తు, పర్యావరణ, భూగోళ, జన్యు, భాషాశాస్త్రాలలో వచ్చిన ఆధునిక ఆవిష్కరణలతో సరితూచి రచయిత సాయి పాపినేని చేస్తున్న అన్వేషణ. ఇది కేవలం చరిత్ర కాదు. గతం మనకిచ్చిన శ్రుతి స్మృతి వాఙ్మయంలోని కథలు, గాథలు, ప్రపంచంలోనే అతిప్రాచీనం, అతిపెద్దదీ అయిన నాగరికత నేపథ్యంలో మళ్లీ ప్రాణం పోసుకుంటాయి.
